బాలయ్య, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘర్షణ
ఏలూరు: నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పరస్పరం ఘర్షణ పడ్డారు. నందమూరి యువసేన నూతన కమిటీల ఏర్పాటు సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది. పరస్పరం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసుకున్నారు. తమవారిని కిడ్నాప్ చేశారంటూ ఒక వర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నందమూరి యువసేన నూతన కమిటీల ఏర్పాటు కోసం భీమవరం నుంచి బాలయ్య అభిమానులు ఏలూరు వచ్చారు. బాలయ్య కటౌట్లతో వారు అక్కడికి చేరుకున్నారు. కటౌట్లపై జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ఉండకూడదని వారు వాదనకు దిగారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. బాలయ్య ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చినందున ఆయన ఫొటో మాత్రమే ఉండాలని ఆయన అభిమానులు పట్టుబట్టారు. ఈ సమయంలో ఇరువురు హీరోల అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇద్దరు నందమూరి హీరోలు తెలుగుదేశం పార్టీ విజయం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా అభిమానులు మాత్రం రెండుగా చీలిపోయారు.