ప్రదక్షిణల వరాహం సొమ్మసిల్లింది
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన వరాహం సొమ్మసిల్లి పడిపోయింది. దానికి భక్తులు సపర్యలు చేస్తున్నారు. వెటర్నరీ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. సోమవారం నాడు మధ్యాహ్నమే అది సొమ్మసిల్లి పడిపోయింది. అయితే వైద్యులు వైద్యం అందించడంతో మళ్లీ లేచింది. అయితే తిరిగి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి సొమ్మసిల్లి పడిపోయింది.
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం చుట్టూ, ధ్వజ స్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసిన వరాహం సోమవారం ఉదయమే మళ్లీ ప్రదక్షిణలు ప్రారంభించింది. ఆదివారం ఉదయం ఆ వరాహం గోదావరి నదిలో స్నానం చేసి ఆలయంలో ధ్వజస్తంభం చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఈ వింత సంఘటనను చూడడానికి వేలాదిగా ప్రజలు తరలించారు. వారంతా చూస్తున్న అదరబెదరక ఆ వరాహం తన పని తాను చేసుకుంటూ పోయింది.
ఆలయ పూజారి బయటకు నెట్టేసినా అది మళ్లీ వచ్చి ప్రదక్షిణలు మొదలు పెట్టింది. ప్రదక్షిణలు చేస్తున్న వరాహానికి ప్రజలు పూజలు చేస్తున్నారు. సోమవారం కూడా అది తన ప్రదక్షిణలు మొదలు పెట్టడంతో దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈ వింతను చూడడానికి వస్తున్నారు. ప్రజలను అదుపు చేయడానికి పోలీసులు కూడా రావాల్సి వచ్చింది.