రాష్ట్రపతే షాక్ అయ్యారు:బాబు
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఒక్కక్కిటిగా వివరిస్తుంటే రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కూడా ఆశ్చర్య పోయారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. సీపీఎం, సీపీఐ, తెరాసల నాయకులతో కల్సి సోమవారం ఆయన రాష్ట్రపతిని కలిశారు. అనంతరం తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు నివాశంలో మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పెంకి, రంకు, బొంకుతనాన్ని ఎండగట్టేందుకు భవిష్యత్లో పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రపతి ముందు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పుస్తకాన్ని ఉంచామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ''ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నా.. ఎవరిపై ఎలాంటి చర్యలు, కనీసం విచారణ కూడా జరిపించని సంఘటన ఎక్కడైనా చూశారా అని రాష్ట్రపతిని ప్రశ్నించాం'' అని తెలిపారు. పీఎం రాష్ట్రకార్యదర్శి బి.వి.రాఘవులు మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతిపాలనపై స్పందించాలని రాష్ట్రపతిని కోరామన్నారు. తెదేపా, తెరాస, సీపీఐ, సీపీఎంల కలయిక అవినీతి అంతానికి నాంది కాబోతోందని చెప్పారు.
సమావేశం ముగిసిన అనంతరం అందరికీ సాదరంగా వీడ్కోలు పలికారు. కేసీఆర్ నివాసం ముందు తొలిసారిగా వందలాదిమంది టిడిపి, టీఆర్ఎస్ కార్యకర్తలు గుమికూడి జై తెలంగాణ నినాదాలివ్వటం అందరినీ ఆకర్షించింది.