'సత్యం' రాజు అరెస్టు తప్పదా?
రామలింగరాజు రాజీనామా వ్యవహారం బయటపడగానే సెబీ, ఆర్వోసీలతోపాటు కేంద్ర ఆర్థికశాఖ అప్రమత్తమైంది. వెనువెంటనే చర్యలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ సీబీసీఐడీతో దర్యాప్తు చేయిస్తామని చెప్పడంతో గందరగోళానికి దారితీసింది. ఇది రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కావడం, సత్యం సంస్థ నిర్వహిస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రభుత్వం సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారంలో పారదర్శకంగా ఉన్నామని చెప్పుకునేందుకే ముఖ్యమంత్రి తొందరపడి సీబీసీఐడీ దర్యాప్తునకు ఆదేశించి ఉంటారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
ఇటువంటి కుంభకోణాన్ని రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగం దర్యాప్తు చేయవచ్చా? లేదా? అన్న దానిపైనా స్పష్టత లేదు. ఎవరైనా వాటాదారులు సత్యం సంస్థ తమను మోసం చేసిందని ఫిర్యాదు చేస్తే మాత్రం ఆలోచించాల్సి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్వోసీ అధికారులు తమ ఏర్పాట్లు మొదలుపెట్టారు. మొత్తం పరిస్థితిని వివరించమని కోరుతూ నోటీసులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు అందలేదని రాష్ట్ర సీఐడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.