కమ్మను కాబట్టే నాపై వివక్ష: నాని
హైదరాబాద్: తాను కమ్మ కులానికి చెందినవాడిని కాబట్టే నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రముఖ ట్రావెల్స్ సంస్ధ యజమాని, ప్రజారాజ్యం విజయవాడ అర్బన్ కన్వీనర్ కేసినేని నాని బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో విమర్శించారు. కాపు కులానికి చెందిన ముత్తంశెట్టి విజయనిర్మలను ఒకరకంగా, కమ్మ కులానికి చెందిన తనను మరో రకంగా చూస్తున్నారని నాని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం లేదని, బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. యాదవ కులానికి చెందిన మాజీ మంత్రి కఠారి ఈశ్వరకుమార్ కు కూడా ప్రజారాజ్యం పార్టీలో న్యాయంజరుగలేదని నాని విరుచుకు పడ్డారు.
విజయవాడలో గాంధీగిరి పనిచేయదని, గూండాగిరి చేయాలని అల్లు అరవింద్ తనకు చెప్పి ఫోన్ పెట్టేశారని నాని చెప్పారు. అల్లు అరవింద్ కు ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారా అని ఒక విలేకరి ప్రశ్నించగా అటువంటిది ఏమీ లేదని నాని జవాబు ఇచ్చారు.
ఇలా ఉండగా, కృష్ణా జిల్లా ప్రజారాజ్యంలో తలెత్తిన వర్గ విభేదాల నేపథ్యంలో విజయవాడ అర్బన్ కన్వీనర్ కేశినేని నాని ఆ పార్టీకి గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రరాపా జిల్లా కన్వీనర్ ముత్తంశెట్టి విజయనిర్మల వర్గీయులతో ఘర్షణ అనంతరం ఆయన పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పిలుపు మేరకు హైదరాబాద్ వచ్చారు. అయితే ఆయన పిలిచికూడా నిన్నంతా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తప్పు ఎదుటివాళ్లదైనా తనను పిలిపించి మాట్లాడకుండా అవమానించారని నాని కోపంగా ఉన్నట్లు సమాచారం.