సత్యం కొత్త సీఈవోగా మూర్తి
హైదరాబాద్: సత్యం సంస్ధ కొత్త సీఈవోగా అచ్యుతని శ్రీనివాస మూర్తిని(ఏఎస్ మూర్తి)నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన డైరక్టర్ల బోర్డు గురువారం ప్రకటించింది. ప్రత్యేక సలహాదారులుగా మేనేజ్ మెంట్,ఫైనాన్షియల్ రంగాల్లో దిగ్గజాల్లాంటి ఖుస్రోఖాన్, పార్ధోదత్తాను ఎంపికచేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సంస్ధ తక్షణ అవసరాలకు ఆరు వందల కోట్లు బ్యాంకు రణాల ఏర్పాటు కూడా పూర్తయినట్లు వివరించింది.
ఈ సందర్భంగా ఏఎస్ మూర్తి మాట్లాడుతూ మేం సాధించాల్సింది తక్కువ విషయమేమీ కాదు. ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మా లక్ష్యాలను నిర్ణయించుని, ఆ దిశగా మా ప్రయాణం పెట్టుకుంటాం. నిర్ణీత కాల వ్యవధిలో ఆ లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి చేస్తాం అన్నారు. రామలింగరాజుకు సన్నిహితుల్లో ఒకరైన మూర్తి కంపెనీ గ్లోబుల్ డెలివరీ యూనిట్ హెడ్ గా ఉన్నారు. స్కామ్ బయిటపడ్డాక ఏర్పాటైన కోర్ టీమ్ లోనూ మూర్తి ఒకరు.