వ్యవసనాలకు బానిసైన వైఎస్: చిరు
రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయి. వీధి రౌడీల్లా కొట్టుకునే దశకు చేరాయి. కుళ్లు, కంపు కొడుతున్నాయి. ఈ రాజకీయాలు పోవాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ర్రాష్టానికి పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన వైఎస్..రాజకీయాలంటే అసహ్యం కలిగిలా ప్రవర్తిస్తున్నారని, అసెంబ్లీ సమావేశాలంటే జుగుప్స కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని చిరంజీవి విమర్శించారు. తెలుగు దేశం పార్టీ సత్యం సంస్థను పెంచి పోషించగా, కాంగ్రెస్ హయాంలో దానిని వట వృక్షంగా మార్చారని రెండు పార్టీలను విమర్శించారు.
అలాగే అధికార పార్టీ నేతలు ప్రాజెక్ట్ల జపం చేస్తున్నది కేవలం ముడుపుల కోసమేనని ఆయన అన్నారు. ఇప్పట్లో ఏ ప్రాజెక్టు పూర్తికాదని, అవి పూర్తికావాలంటే కనీసం పాతికేళ్లు పడుతుందన్నారు. దండగమారి వ్యవసాయం అన్న బాబుకు రైతులపై హఠాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చిందో అర్థం కావటంలేదంటూ అన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 10 గంటలపాటు ఉచిత విద్యుత్ను అందిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాల్లో వైఎస్ బినామీ భాగస్వామిగా ఉన్నారని విమర్శించారు. కాగా..చిరంజీవి గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న రోడ్షో శుక్రవారంతో ముగియనున్నది. 9న మంగళగిరి నుంచి ప్రారంభమైన రోడ్షోకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య ఆదరణలభించడంపై చిరంజీవి తబ్బిబ్బయ్యారు.