2 న తమిళ పోలీసుల నిరాహార దీక్ష
చెన్నై: మద్రాస్ హైకోర్టులో జరిగిన లాఠీచార్జీకి సంబంధించి పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని డిమాండ్ చేస్తూ మార్చి 2వ తేదీన తమిళనాడు పోలీసులు తమ కుటుంబసభ్యులతో సహా నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు పోలీసుల సంఘ మాజీ అధ్యక్షుడు, పదవీ విరమణ పొందిన పోలీసు అధికారి ఆంథోనీ స్వామి నగరంలో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పోలీసుశాఖ, న్యాయశాఖలు అన్నదమ్ముల వంటివని, ఈ రెండు శాఖలు ఐక్యతగా ఉంటేనే సామాన్యులకు న్యాయం చేకూరుతుందన్నారని, దురదృష్టవశాత్తూ హైకోర్టు ప్రాంగణంలో అన్నదమ్ముల మధ్యే ఘర్షణ జరిగిందని, ఈ వ్యవహారంలో పోలీసులపై న్యాయవాదులు పెంచుకున్న ద్వేషాన్ని విడనాడాలని స్వామి అన్నారు. రాష్ట్రప్రభుత్వం హైకోర్టు ఘర్షణలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీచేసిందని, విచారణ ముగిసేవరకు సంబంధిత పోలీసులపై చట్టరీత్యా ఎటువంటి చర్యలు తీసుకోరాదన్న డిమాండ్తో తమ సంఘం పోలీసులకు మద్దతుగా నిరాహారదీక్ష జరుపనుందని వివరించారు.