హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: లక్డీకాపూల్ సమీపంలోని రెయిన్ బో హోటల్ లో అర్ధరాత్రి దాటాకా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో 40మంది కస్టమర్లు హోటల్ లో ఉన్నట్లు సమాచారం. మంటలు, పొగతో హోటల్ నిండిపోవడంతో కస్టమర్లు, సిబ్బంది ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించిన కొద్ది సేపటికే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడినట్లు తెలిసింది. మంటల్లో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది రక్షించగా వీరిలో కొందరు గాయపడ్డారు. మరోవైపు అక్కడికి చేరిన మీడియాపై హోటల్ సిబ్బంది దాడులు చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. అప్పుడు అక్కడేఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఈ హోటల్ లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని తెలుస్తోంది.
కస్టమర్లలో నలుగురు హోటల్ భవంతిపై నుంచి దూకి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తున్నది. కాగా, నాలుగు అగ్నిమాపక దళాలకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలో ఆస్పత్రికి తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఈ సంఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.