బాలకృష్ణ హిందూపురం నుంచేనా?
హైదరాబాద్: అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ పోటీ చేసే అవకాశముంది. రాయలసీమ ప్రాంతంలో శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులపై తెదేపా కసరత్తు కొలిక్కి వచ్చింది. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 52 స్థానాలపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. నాలుగైదు స్థానాలు మినహా మిగతా వాటిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత ఈసారి పెనుకొండ నుంచి కాక రాప్తాడునుంచి బరిలోకి దిగనున్నారు. ఆమె సొంత మండలం రామగిరి పునర్విభజనలో భాగంగా రాప్తాడులో కలవడంతో...అక్కడ అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు సూచన మేరకు ఆమె అక్కడి నుంచి బరిలోకి దిగనున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ అసెంబ్లీ స్థానంపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయినట్లే.
ఇక్కడినుంచి కేఈ ప్రభాకర్, ఎస్వీ మోహన్రెడ్డి ఇద్దరూ అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డారు. జరుగుతున్న పరిణామాలను గమనించిన ఎస్వీ మోహనరెడ్డి ఇక తనకు టిక్కెట్టు రాదని గ్రహించి బుధవారం చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశానికి దూరంగా ఉండిపోయారు. దీంతో కేఈ ప్రభాకర్కే అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. ఎస్వీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు మోహనరెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమయింది. కర్నూలు జిల్లాలో కర్నూలు అసెంబ్లీ సీపీఎంకు, ఆలూరు సీపీఐకు కేటాయించినట్లే. కర్నూలు నుంచి సీపీఎం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్ మళ్లీ బరిలోకి దిగనున్నారు.
ఆలూరు నుంచి సీపీఐ తరఫున కె.రామకృష్ణ అభ్యర్థిత్వం ఖరారు కావచ్చు. కడప నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత శ్రీకాంత్రెడ్డి ఎంపీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చేసి ఏడాదినుంచి రాజంపేటలో పనిచేసుకుంటున్న వేమన సతీష్ ఆ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ స్థానం నుంచి పసుపులేటి బ్రహ్మయ్య కూడా బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. ఇంకో రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఎమ్మెల్సీ పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాయలసీమలోని 4 జిల్లాల్లో తెదేపా అభ్యర్థుల జాబితా ఇలా ఉంది.