మేమే పెద్ద యాక్టర్లం: బొత్స
విశాఖపట్నం: "మేమే పెద్ద యాక్టర్లం. మాకు యాక్టర్లెందుకు. మాకే చాలా మంది అభిమానులు ఉన్నారు" వివిధ పార్టీలకు సినిమా తారలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానం ఇది. బుధవారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల గురించి అడిగినప్పుడు మంత్రి అనేకసార్లు కోడ్ గుర్తుచేసుకున్నారు. నియమావళి పరిధిలోకి వస్తే ఇబ్బందని, తనను ఇరుకున పెట్టవద్దని పదేపదే సూచించారు. పేదల కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై విపక్షాలు రాద్ధాంతం చేసి అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎన్నికల కోడ్ సాకుతో అడ్డుకుంటున్నాయని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇందిరమ్మ పథకం ఇప్పటికే అమల్లో ఉన్నందున దాన్ని ఆపవద్దని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు వెల్లడించారు. "నాలుగేళ్ల 11 నెలల కాలంలో మా ప్రభుత్వం అనేక సంచలన పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి. ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తున్నాం. 70 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. ఇళ్ల నిర్మాణానికి వేసవి అనువైన సీజన్. కానీ విపక్షాలు స్వార్థ బుద్ధితో అడ్డుకుంటున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్లే బుద్ధి చెబుతారు" అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్ని టిక్కెట్లు అడుగుతున్నారని అడగ్గా.. కేటాయింపులో కుటుంబాలు, స్నేహాలు, బంధాలు ఉండవని..ఎవరు గెలిస్తే వాళ్లకే టికెట్లు ఇస్తారని బదులిచ్చారు.