వైఎస్ లక్ష కోట్లు తిన్నాడు: ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీకి తిరిగి వైభవం తెచ్చే లక్ష్యంతో బరిలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ శుక్రవారం టెక్కలి రోడ్ షోలో కావలసినంత కవిత్వం కురిపించారు. వైఎస్ అవినీతి, జలయజ్ఞం వంటి వివిథ పథకాల లోగుట్టుపై ఆయన విసిరిన చణుకులు యువతను విశేషంగా ఆకర్షించాయి. ఇక అడుగుడుగునా అభిమాన జన నీరాజనాల సంగతి చెప్పనక్కరలేదు.
భూములు కాజేయటానికే వైఎస్సార్ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు తప్ప పేదల కష్టాలు గమనించేందుకు కాదని అందుకే అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వభూములన్నీ వరుసపెట్టి అమ్మారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కాంగ్రెస్ కామందు ప్రజల పాలిట రాబందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు టెక్కలి, పాతపట్నం, మెలియాపుట్టి రోడ్ షోల్లో ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాటిమాటికీ లక్ష్యసాధన అంటుంటారని అంటే సీఎం కాక ముందు ఆయనకు లక్షకోట్ల సంపాదన లక్ష్యంగా ఉండేదని ఇప్పటికి అది నెరవేరిందని అన్నారు. హరితాంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని మారుస్తామని అన్నారని చివరకు అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారని అన్నారు.