కడపలో జాగ్రత్తగా..ఈసీ
హైదరాబాద్: ఇకపై కడప కలెక్టర్ తీసుకునే ప్రతి నిర్ణయం పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా ఉండాల్సి ఉంది. నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే కలెక్టర్లను కూడా బదిలీచేస్తాం అని ఎలక్షన్ కమిషన్ గట్టి హెచ్చరికచేసింది. జాబ్లీహాలులో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్ గోపాలస్వామి, కమిషనర్లు నవీన్చావ్లా, ఎస్.వై.ఖురేషీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావు కూడా ఇందులో పాల్గొన్నారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఏజెంట్లను పెట్టే పరిస్థితిలేదని, అనేక ఎన్నికల అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇప్పటికే అనేకసార్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేశారు. అంతేగాక గురువారం కూడా చంద్రబాబు కడప గురించే ఈసీ దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాంతో ముఖ్యమంత్రి వైఎస్ పులివెందుల నుంచి పోటీచేస్తున్న నేపథ్యంలో కడపపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కమిషన్ నిర్ణయించింది.