చిరు,వైఎస్,బాబుపై నిఘా నేత్రం
ఈసారి ఎన్నికల్లో పోటీచేసే అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నాయకులపై ఎన్నికల సంఘం గట్టి నిఘా వేయనుంది. నామినేషన్ వేసిన దగ్గర్నించీ ఎన్నికలు పూర్తయ్యేదాకా వీడియోగ్రాఫర్ వారిని అనుసరిస్తాడు. ఎవరెవర్ని కలుస్తున్నారు? ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఇలా ప్రతి కదలికలను దగ్గర్నుంచి పరిశీలిస్తుంటారు. ఈ జాబితాలో ముఖ్యమంత్రితోపాటు పోటీలో ఉన్న ప్రతిపక్ష నేతలు, మంత్రులు, ప్రభుత్వ విప్, ఇతర ముఖ్యనేతలు ఉంటారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వీడియోగ్రాఫర్లను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ప్రముఖుల వెంట వీడియోగ్రాఫర్లను పంపించడమేగాకుండా పోలింగ్ రోజున ఆయా నాయకుల నియోజకవర్గాల్లోని ఎన్నికల కేంద్రాల్లోనూ ఎన్నికల సరళిని కూడా చిత్రీకరించాలని నిశ్చయించారు. వీడియో వివరాలను జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఏరోజుకారోజు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఏసైట్లో వీటి వివరాలు పొందుపర్చాలి? ఎంత నిడివితో ఉంచాలన్న అంశాలను వారంరోజుల్లోగా వెల్లడించేందుకు కసరత్తులు చేస్తున్నారు. అభ్యర్థుల ప్రచారం, నియోజకవర్గాల్లో పోలింగ్పై అభ్యంతరాలున్న వారు ఈ సైట్ను చూడవచ్చు. పూర్తి సీడీ కావాలనుకుంటే ఎన్నికల సంఘాన్ని సంప్రదిస్తే అందజేస్తారు. వీడియోగ్రాఫర్లు అందుబాటులో లేకుంటే డిజిటల్ ఫోటోగ్రాఫర్లను ఉపయోగించుకోమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గోపాలస్వామి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్బారావుకు సూచించారు.