రాష్ట్రంలో తొలి దశ ప్రచారానికి తెర
హైదరాబాద్: రాష్ట్రంలో తొలి దశ ఈ నెల 16వ తేదీన పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రచారానికి తెర పడింది. 14 జిల్లాల్లో 22 లోక్ సభ, 154 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో ఎన్నికలు జరగనున్నాయి. చివరి రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. ఆయన కాంగ్రెసు పార్టీని ఓడించాలని ప్రజలను కోరారు. సినీ నటుడు బాలకృష్ణ రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాగా, చిరంజీవి ఉత్తరాంధ్రలో పర్యటించారు. కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కృష్ణా జిల్లాలో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం చేపట్టారు.
తొలి దశ ఎన్నికలు తెలంగాణలో, ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి. నక్సలైట్ల ప్రభావం ఈ జిల్లాల్లో అధికంగా ఉండడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తొలి దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలతో ప్రచారం నిలిపివేయాలని, ఆ తరువాత ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ సుబ్బారావు అంతకు ముందు తెలిపారు.