మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. మీ కంఫర్ట్ జర్నీ కోసం కీలకనిర్ణయం!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్. హైదరాబాద్ నగరంలో ప్రజలు రోడ్డు మీద ప్రయాణం చేసే దానికంటే మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్న మెట్రో అవసరాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
ప్రయాణికుల ఇబ్బంది తొలగించే ప్రణాళిక
దీనిలో భాగంగా నేడు HMRL అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి అజిత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మెట్రో రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పీక్ అవర్స్ లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించడం కోసం వీలైనంత త్వరగా అదనపు కోచ్ లను సమకూర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయాలని మెట్రో అధికారుల ప్లాన్
దీనికోసం సంబంధిత తయారీదారులతో చర్చించి త్వరితగతిన బోగీలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. స్టేషన్ల నుండి బయటకు వచ్చిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలుగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ఆర్టీసీ మరియు రవాణా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఫీడర్ సర్వీసులను, వాహన సదుపాయాలను విస్తరిస్తున్నారు.
ప్రయాణికుల భద్రత మరియు సదుపాయాల కల్పన పైన చర్చ
అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లను మెట్రో స్టేషన్లను అనుసంధానించేలా ఏర్పాటు చేసిన స్కై వాక్ ల నిర్వహణతో పాటు వాటి పొడిగింపు పైన రైల్వే అధికారులతో కలిసి పని చేయనున్నారు. మొత్తంగా మొదటి దశలోని 69 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్రో కారిడార్లలో ప్రయాణికుల భద్రత మరియు సదుపాయాల కల్పన పైన ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు.
ప్రతి మెట్రో స్టేషన్లో స్థానిక ప్రత్యేక ప్రణాళిక
ఇది మాత్రమే కాకుండా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కూడా ప్రతి మెట్రో స్టేషన్లో స్థానిక ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు. మొదట దీనిని కొన్ని స్టేషన్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి ఆపై అన్ని స్టేషన్లకు విస్తరించాలన్న ప్లాన్ చేస్తున్నారు.
అక్కడ పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు ప్రతిపాదనలు
ఐటీ కారిడార్ పరిధిలోని హైటెక్ సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్ వంటి అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పురోగతిని కూడా సమీక్షించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి మెట్రో సేవలను స్వయంగా పరిశీలించి తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు.













Click it and Unblock the Notifications