కొత్త వారికీ చాన్స్: వైయస్
న్యూఢిల్లీ: తన మంత్రి వర్గంలో కొత్త వారికి కూడా చాన్స్ ఉంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తమ మంత్రివర్గంలోకి 35 మందిని తీసుకునే అవకాశం ఉంది. మంత్రుల ప్రమాణ స్వీకారం సోమవారం సాయంత్రం గం.6.40 నిమిషాలకు జరుగుతుంది. రాత్రి 8 గంటలకు తొలి మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. మంగళవారం ముఖ్యమంత్రి వైయస్ ఇజ్రాయెల్ వెళ్తారు.
ఓడిపోయినవారికి, తొలిసారి శాసనసభకు గెలిచినవారికి మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశం లేదు. శాసనమండలి నుంచి మాజీ మంత్రి కె.రోశయ్యకు మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ స్థితిలో టి. జీవన్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. సోమవారం సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన వారికి ఫోన్ ల ద్వారా సమాచారం వెళ్లింది. ఇంతకు ముందు మంత్రులుగా పని చేయనివారికి ఈసారి అవకాశం దక్కవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వట్టి వసంతకుమార్ లాంటి వారికి ఈసారి మంత్రి వర్గంలో స్థానం దక్కుతుంది.