భారత విద్యార్థిపై అసీస్ లో తాజా దాడి
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారత విద్యార్థిపై తాజాగా దాడి జరిగింది. సిడ్నీలోని భారత విద్యార్థి ఫ్లాట్ లోకి దుండగులు పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ దాడిలో 25 ఏళ్ల రాజేష్ కుమార్ అనే భారత విద్యార్థి గాయపడ్డాడు. రాజేష్ కుమార్ శరీరం 30 శాతం కాలిపోయింది. ఈ విషయాన్ని భారత సమాజానికి సంబంధించిన వార్తా పత్రిక సౌత్ ఆసియా టైమ్స్ రాసింది. పెట్రోల్ బాంబు దాడి జరిగిన వెంటనే రాజేష్ కుమార్ శరీరాన్ని ఫ్లాట్ సహచరుడు బ్లాంకెట్ తో కప్పాడు. మరిన్ని గాయాలు కాకుండా అది కాపాడింది. కిటికీలోంచి దుండగులు చిన్నపాటి పెట్రోల్ బాంబు ఫ్లాట్ లోకి విసిరినట్లు చెబుతున్నారు.
మెల్ బోర్న్ లో తెలుగు విద్యార్థులపై దాడి ఘటనలో శ్రావణ్ కుమార్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ తర్వాత బల్జీందర్ సింగ్ అనే భారత విద్యార్థిపై కత్తులతో దాడి జరిగింది. తగిన చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఈ దాడులు ఆగడంలేదు.