కేసీఆర్ను అనేంత సీన్ లేదు: తెరాస
హైదరాబాద్ : తమ పార్టీ అధ్యక్ష్యుడు కేసీఆర్పై విమర్శించే స్థాయి యెన్నం శ్రీనివాస్రెడ్డి కు లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయ్చందర్ అన్నారు. కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించిన యెన్నం శ్రీనివాస్రెడ్డి వైఖరిని తెరాస తప్పుబట్టింది. కేసీఆర్ పై శ్రీనివాస్ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్నగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ యెన్నం తెలంగాణ ఉద్యమానికి చేసిందేమీ లేదన్నారు. ఇటువంటి వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఓ ప్రకటనలో తెలిపారు.
పార్టీ వైఫల్యం చెందడానికి గల కారణాలను విశ్లేషించకుండా, కనీసం నాయకులకు కూడా అందుబాటులో లేకుండా ఢిల్లీలో దాక్కోవటమేంటని మహబూబ్ నగర్ జిల్లా పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వైఫల్యాలకు కేసీఆర్ బాధ్యత వహించి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆయన అన్నారు. సీనియర్ పార్టీ నాయకులు బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరారు. కేసీఆర్పై తిరుగబాటు బావుటా ఎగరవేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అసంతృప్తులు దాడి చేస్తారని అనుమానంతో తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.