సహనం వహించండి: కృష్ణ సూచన
న్యూఢిల్లీ: సహనం వహించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ ఆస్ట్రేలియాలోని భారతీయ విద్యార్థులకు సూచించారు. ఆస్ట్రేలియన్ పై భారత విద్యార్థులు ప్రతీకారంగా దాడి చేశారని వార్తలపై ఆయన మంగళవారం పార్లమెంటులో ఈ సూచన చేశారు. ఓపిక పట్టి సహనంతో వ్యవహరించాలని తాను భారత విద్యార్థులను కోరదలుచుకున్నానని, ఉన్నత విద్యను అభ్యసించడానికి వారు అక్కడికి వెళ్లారని, ప్రతీకారానికి దిగకుండా చదువులపై భారతీయ విద్యార్థులు దృష్టి కేంద్రీకరించాలని ఆయన అన్నారు. భారత విద్యార్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆస్ట్రేలియా హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.
తమ దేశానికి చెందిన విద్యార్థులపై దాడులను ఎదుర్కోవడానికి భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో గస్తీ బృందాలుగా ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ విద్యార్థులు ఆ పనిని మానుకోవాలని, తమ పని తమను చేయనివ్వాలని ఆస్ట్రేలియా పోలీసులు సూచించారు.