పిడుగులు పడి ఎనిమిది మంది మృతి
హైదరాబాద్:రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల రహదారులు ధ్వంసం కాగా, కొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. వేర్వేరుచోట్ల పిడిగు పడిన ఘటనల్లో ఎనిమిది మంది మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. మరో సంఘటనలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి తోడు పిడుగులు పడటంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. సదాశివనగర్ మండలం రంగంపేటలో దర్ని లింగం (35), అదరి బాలయ్య (28); తాడ్వాయి మండలం కరడ్ పల్లిలో మామిడి ఎల్లయ్య (58); లింగంపేట మండలం నల్లమడుగులో అన్నాచెల్లెళ్లు ఖాదీర్ (35), అజ్మీరా (30); మద్నూర్ మండలంలోని చిన్నషక్కర్గాలో శీల (17); పెద్ద ఎక్లారా గ్రామంలో మల్గొండ (32) పిడుగుపాటు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మెదక్ జిల్లా ఆందోలు మండల పరిధిలోని పోసానిపేట గ్రామంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై అనురాధ(32) అనే మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా ఆస్పర్తి మండలం నగరూరులో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బోరు నుంచి మంచినీటిని తెచ్చుకోవడానికి తల్లితోపాటు వెళ్లిన నవీన్(9), అశోక్(8) అనే అన్నదమ్ములు ఓ సెల్ టవర్ వద్ద విద్యుత్తు ప్రసరించడంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.