టార్గెట్ విజయ్ - సుప్రీం లాయరా ? ఆధ్యాత్మిక గురువా ? మోడీ ఛాయిస్ ఏంటి ?
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ క్రమంగా కుదురుకుంటున్నారు. పాలనపై తన మార్కు చూపిస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే సాయంతో తమిళనాడులో ఉనికి చాటుకోవాలన్న బీజేపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో భవిష్యత్తులో తమిళనాట పాగా వేయాలంటే విజయ్ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కేంద్రానికి ముఖ్యం. ఇందులో భాగంగా తమిళనాడులో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక గవర్నర్ అర్లేకర్ స్ధానంలో పూర్తి స్దాయి గవర్నర్ నియామకానికి కేంద్రం సిద్దమవుతోంది.
తమిళనాడుకు త్వరలోనే పూర్తిస్థాయి కొత్త గవర్నర్ (Tamil naduu Governor)ను నియమించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతేడాది మార్చి నెలలో అప్పటి తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవిని పశ్చిమ బెంగాల్కు పూర్తిస్థాయి గవర్నర్గా పంపారు. అప్పటి నుంచీ కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడుకు అదనపు బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రానికి, రాజకీయంగా కీలక వ్యూహాలు ఉండే ప్రాంతానికి సుదీర్ఘ కాలం పూర్తిస్థాయి గవర్నర్ లేకపోతే పరిపాలనా ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి కొత్త గవర్నర్ నియామకంపై కేంద్రం దృష్టిసారించింది.

ఇందులో భాగంగా ఇద్దరి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ ఇద్దరి పేర్లూ రవిశంకర్ కావడం విశేషం. ఇందులో ఒకరు కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, బీజేపీ ఎంపీ కూడా అయిన రవిశంకర్ ప్రసాద్ కాగా.. మరొకరు ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్. తమిళనాడులో కొంతకాలంగా అసెంబ్లీ ఆమోదించిన పలు కీలక బిల్లులు, ఇతర పత్రాల ఆమోదం విషయంలో ప్రభుత్వానికీ, లోక్ భవన్ కూ మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ చట్టాలపై లోతైన అవగాహన, మంచి అనుభవం కలిగిన వ్యక్తిని పంపాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో రవిశంకర్ ప్రసాద్ ను ఎంచుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ రేసులో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఆయన ఆధ్యాత్మిక రంగంలోనే చురుగ్గా ఉండడం వల్ల ఆ అవకాశాలు చాలా తక్కువని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications