Mudragada:ముద్రగడ బ్రాండ్ ఎవరి సొంతం..మారిపోతున్న లెక్కలు..!?
ముద్రగడ పద్మనాభం...ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్లో ఉన్న పేరు.కాపు సామాజిక వర్గాన్ని కొన్ని దశాబ్దాల పాటు ముందుండి నడిపిన నేత. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన లీడర్. అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ముద్రగడ వారసత్వాన్ని ఎవరు అంది పుచ్చుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది.అలాంటి ఓ నాయకుడు మళ్లీ వస్తాడా అనే చర్చ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది.
ముద్రగడ వారసత్వం ఎవరది..?
మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శకం ముగిసిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరనే చర్చ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఆయన 1970వ దశకంలో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి తన సామాజిక వర్గమైన కాపుల అభివృద్ధి కోసమే బాహాటంగా పనిచేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండును ఢిల్లీ వరకు తీసుకెళ్లి అక్కడ చర్చ జరగడంలో సక్సెస్ అయ్యారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన కాపు సామాజిక వర్గం అనే లైన్కే ఆయన తొలి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన మరణానికి రెండేళ్ల ముందు వైసీపీలో చేరిన ముద్రగడ... వైసీపీ నేతగానే తుదిశ్వాస విడిచారు.ఇప్పుడు ఆయన పాత్ర ఎవరు పోషిస్తారా..? ఆ సామర్థ్యం ఎవరికుందనే చర్చ ఇటు ముద్రగడ అభిమానుల్లో అటు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ముద్రగడ వారుసుడిగా ఆయన చిన్న కుమారుడు గిరి ఆ బాధ్యతలను తీసుకుంటారా అంటే..రాజకీయంగా ఓకే. కానీ కాపు సామాజిక వర్గాన్ని సొంతం చేసుకుని నిత్యం పోరాడే శక్తి పటిమలు ఆయనలో ఉన్నాయా అనేది చెప్పడం కష్టమే. ప్రస్తుతం ఆయన పత్తిపాడు వైసీపీ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారు. రాజకీయాల వరకు ముద్రగడ వారసుడిగా ఓకే.. కాపు సామాజిక వర్గానికి నిలువెత్తు కోటలా ముద్రగడ నిలిచారు. ఆ సామాజిక వర్గంలోని పేదల జీవితాలు బాగుపడటం కోసం అహర్నిశలు పనిచేశారు. ఎక్కడైనా సరే, వేదికేదైనా సరే ముందు తన జాతి ప్రయోజనాలే ముఖ్యమని బాహాటంగా ధైర్యంగా ముద్రగడ చెప్పేవారు. అలాంటి వారసత్వం ఎవరు తీసుకోగలరు, ముందుండి ఎవరు నడిపించగలరనే చర్చ జరుగుతోంది.
ముద్రగడపై తిరుగుబాటు జెండాతో కూతురు
ఇక ముద్రగడ కుమార్తె క్రాంతి తన తండ్రి పార్థీవదేహాన్ని చివరి చూపు చూసేందుకు వచ్చినప్పుడు ఎంత వివాదమైందో తెలుగు రాష్ట్రాలు చూశాయి. ఆమెను ముద్రగడ అభిమానులు అడ్డుకున్నారు. క్రాంతి ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. తండ్రితో విబేధించిన ఆమె..ముద్రగడపై బాహాటంగానే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే ముద్రగడ కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్నంతగా ఆమె చేసుకోలేరనే అభిప్రాయం ఉంది. పైగా ముద్రగడ అభిమానులు ఆమెకు సహకరించే పరిస్థితుల్లో లేరు.అయితే వైసీపీ ఆమెను అడ్డుకుందని అధికార కూటమి నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇక ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలని భావించినా అందుకు ముద్రగడ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.వైసీపీ నేతలు కూడా పోలీసులను అడ్డుకున్నారు.దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పొలిటికల్ సర్కిల్స్లో చర్చ
ముద్రగడ మరణం తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.కాపు సామాజిక వర్గాన్ని సొంతం చేసుకునేందుకు ఇటు కూటమి ప్రభుత్వం అటు ప్రతిపక్ష పార్టీ వైసీపీలు పోటీపడుతున్నాయి. ఇక వైసీపీ నేతగానే ముద్రగడ ఉండటం, ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో ఉండటం ఒకరకంగా ముద్రగడ అభిమానులు కూడా వైసీపీకే మద్దతు పలికే అవకాశం ఉందని చెప్పొచ్చు.అంతేకాదు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్..ముద్రగడ పాడెను మోయడం,చివరి క్రతువు ముగిసేవరకు అక్కడే ఉండటం చాలామందిని ఆకట్టుకుంది. ముద్రగడ బతికున్న సమయంలో రాజకీయంగా ఆయనతో టీడీపీ జనసేనలు విబేధించి ఉండొచ్చు.. అయితే ఇకపై కాపు నేతగా ముద్రగడకు అన్ని విధాలుగా ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పడంలో అనుమానం లేదు. అయితే ఏపీ రాజకీయాల్లో కాపులు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండటంతో కాపుసామాజిక వర్గం ఎవరివైపు నిలుస్తారనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.ఇదే సమయంలో కుమార్తె క్రాంతి జనసేలో, కుమారుడు గిరి వైసీపీలో ఉండటంతో ముద్రగడను అభిమానించి కాపువర్గం వీరిద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారుతోంది..












Click it and Unblock the Notifications