మహిళా కానిస్టేబుల్ హత్య
హైదరాబాద్: ఓ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చార్మినార్ మహిళా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న డి.కుసుమ కుమారి (39) కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీ నాలుగో ఫేజ్లోని ఫ్లాట్లో భర్త భిక్షపతి(43), కుమారుడు సాయిరితీష్(14), కుమార్తె కావ్య(11)లతో కలిసి నివాసముంటోంది. వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని నాగాయపల్లికి కుసుమ స్వస్థలం.
15 ఏళ్ల క్రితం ఆటోడ్రైవర్ అయిన భిక్షపతిని ప్రేమ వివాహం చేసుకుంది. కూకట్పల్లి ప్రాంతంలోనే నివసిస్తున్న ఆమె బంధువు నాగేశ్వరరావు సీసీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తుండటంతో ప్రతి రోజు ఉదయం తన వాహనంపై ఆమెను విధులకు తీసుకెళ్లి తిరిగి ఇంటికి తీసుకువచ్చేవాడు. శనివారం రాత్రి నాగేశ్వరరావు యథావిధిగా ఆమెను ఇంటి వద్ద దించాడు. తిరిగి ఆదివారం ఉదయం నాగేశ్వరరావు విధులకు బయలుదేరడానికి ముందు కుసుమ కుమారికి ఫోన్ చేయగా ఆమె సెల్ ఆఫ్ చేసి ఉంది. ఇంటికి వెళ్ళి చూడగా ఆమె హత్యకు గురై ఉంది.