అమర్ నాథ్ యాత్రలో ఆంధ్రుడి మృతి
శ్రీనగర్: పవిత్ర అమర్ నాథ్ యాత్రలో మరో వ్యక్తి మృతి చెందాడు. యాత్ర మార్గంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మోహన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. దక్షిణ కాశ్మీరు హిమాలయాల్లో ఏటా జరిగే ఈ యాత్రలో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య ఏడుకు చేరినట్లు పోలీసులు తెలిపారు.
జమ్ములోని యాత్రి నివాస్ శిబిరం నుంచి గురువారం ఉదయం మరో 1667 మంది భక్తులు యాత్రకు బయలుదేరారు. పటిష్ఠ బందోబస్తు నడుమ వీరంతా ప్రయాణమైనట్లు అధికారులు తెలిపారు. బల్తాల్ శిబిరం నుంచి 54 వాహనాలు బయల్దేరాయి. యాత్రికుల్లో 308 మంది మహిళలు, 60 మంది చిన్నారులు, 533 మంది సాధువులు ఉన్నట్లు వివరించారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి బుధవారం యాత్రను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అమర్ నాథ్ యాత్రకు పహల్గాం మార్గం కూడా సిద్ధమవుతోంది. ఈ మార్గంలో శుక్రవారం నుంచి భక్తులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్ ఏఎస్ బీ ముఖ్య కార్య నిర్వహణాధికారి బీబీ వ్యాస్ తెలిపారు. విపరీతంగా మంచు కురవడంతో ఇప్పటి వరకు పహల్గాం మార్గంలో యాత్రికులను అనుమతించలేదు.












Click it and Unblock the Notifications