సహాయ చర్యలకు వేయి కోట్లు: పిఎం
వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు శక్తివంచన లేకుండా పని చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది ప్రజలపై ప్రభావం చూపే ఏ విపత్తయినా జాతీయ విపత్తేనని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు సంభవించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయం ఎంతన్నది ఇరు ప్రభుత్వాల అధికారుల చర్చల తర్వాత తేలుతుందని ఆయన చెప్పారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుందని ఆయన చెప్పారు. ప్రధానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య కృతజ్ఞతలు తెలిపారు. రేపు ప్రధాని మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లోని వరద తాకిడి ప్రాంతాలను సందర్శిస్తారని ఆయన చెప్పారు. ప్రధాని హామీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ లో వరద తాకిడి ప్రాంతాలను సందర్శించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి కె. రోశయ్య, కేంద్ర మంత్రులు ఎస్ జైపాల్ రెడ్డి, వీరప్ప మొయిలీ తదితురులున్నారు. నాలుగు హెలికాప్టర్లలో వారు వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రధాని హైదరాబాదుకు చేరుకున్నారు. రాజభవన్ లో వరద పరిస్థితిపై మంత్రులు, అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం వరద తాకిడిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను వీక్షించారు. ఫొటో ప్రదర్శనను తిలకించారు. వరద తీవ్రతపై ముఖ్యమంత్రి రోశయ్య ప్రధానికి వివరించారు.