ప్రజలపై పెట్రో బాంబ్..? లీటర్ పెట్రోల్ పై రూ.20 వరకు పెంపు..?
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం అలాగే పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు సంస్థలపై ఆర్థిక భారం పడింది. దీనివల్ల పెట్రోల్ ధర లీటర్ కు రూ. 5 నుంచి రూ. 20 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ధరలు పెరగకముందే ట్యాంకులు నింపుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు చేరుకుంటున్నారు. దాంతో దేశంలోని ప్రధాన నగరాలైన దిల్లీ, గురుగ్రామ్, పాట్నా వంటి నగరాల్లో కిలోమీటర్ల మేర వాహనాల క్యూ కనిపిస్తున్నాయి.
మరోవైపు అధిక డిమాండ్, సరఫరాలో అంతరాయం కారణంగా రాజస్థాన్ లోని అల్వార్, గుజరాత్ లోని మహీసాగర్ వంటి ప్రాంతాల్లోని కొన్ని బంకుల్లో నో పెట్రోల్, నో డీజిల్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదిలాఉంటే చమురు మార్కెటింగ్ సంస్థలు నెలకు సుమారు రూ. 30 వేల కోట్ల మేర నష్టాలను ఎదుర్కుంటున్నాయని అందుకే ధరల పెరుగుదల అనివార్యమని ప్రభుత్వ వర్గాలు సూచనలు చేస్తున్నాయి. అయితే ప్రజలు ముందస్తుగా చమురును నిల్వ చేసుకోవద్దని అధికారులు చెబుతున్నారు. మే 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇటీవల ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలన్నారు. అంతేకాక ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని హితవు పలికారు.
ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు మోదీ కాన్వాయ్ ఇప్పుడు రెండు వాహనాలకు తగ్గింది. ప్రధాని మోదీ బాటలోనే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తమ కాన్వాయ్ లో వాహనాలను తగ్గించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం కాన్వాయ్ ను తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన కొరత లేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇటీవల స్పష్టం చేశారు. భారత్ వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని అవి 69 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే 45 రోజులకు సరిపడా ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందన్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 35 వేల టన్నుల నుంచి దాదాపు 54 వేల టన్నులకు పెంచినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications