మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపితో అధికారం పంచుకుంటున్న కాంగ్రెసు బిజెపి - శివసేన కూటమి నుంచి తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది.పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. నక్సల్స్ ప్రభావం ఉన్న మహారాష్ట్రలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రచార పర్వం దాదాపు ప్రశాంతంగా ముగిసినప్పటికీ నక్సల్స్ హింస ప్రమాదకరంగా పరిణమించింది. గత వారం గడ్చిరోలీ జిల్లాలో మావోయిస్టులు 17 మంది పోలీసులను బలి తీసుకున్నారు. ఈ జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.
ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ సుడిగాలి పర్యటనలు చేశారు. బిజెపి నేతలు ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ఎం. వెంకయ్యనాయుడు ప్రచారంలో పాల్గొన్నారు.