వైయస్ జగన్ తో భేటీకి సోనియా గాంధీ విముఖత?
మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో తనకు పిలుపు వస్తుందని జగన్ ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చాకనైనా పిలుపు వస్తుందని జగన్ వర్గీయులు అంటున్నారు. అయితే సోనియా మాత్రం జగన్ పట్ల ఏ మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న గౌరవంతో తాము ఇచ్చిన అవకాశాన్ని జగన్ మరో రకంగా తీసుకున్నారని, తాను లేకుండా పార్టీ లేదనే వాతావరణాన్ని సృష్టించారని, అందువల్ల జగన్ ను దువ్వాల్సిన అవసరం గానీ ఆయనకు అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వడం గానీ చేయకూడదని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మంత్రులు సహకరించకపోవడం, శాసనసభ్యులు, మంత్రులు కొంత మంది జగన్ కు అనుకూలంగా మాట్లాడిన, మాట్లాడుతున్న తీరు తమను జగన్ ధిక్కరించినట్లుగానే అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రమేయం లేకుండా మంత్రులు, శాసనసభ్యులు ఆ విధంగా వ్యవహరిస్తారని భావించడం లేదని అంటున్నారు. తొలుత కొంత దిగివచ్చినట్లు కనిపిస్తే జగన్ తో మాట్లాడడానికి సుముఖంగా ఉన్నప్పటికీ వ్యవహారం చాలా దూరం వెళ్లడంతో ఇక దిగి వచ్చేందుకు సోనియా గాంధీ ఏ మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు.