మా టార్గెట్ యుపిఎ సర్కార్: కె చంద్రశేఖర రావు
హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా చేసే ప్రయత్నాలపై న్యాయపోరాటమూ క్షేత్ర స్థాయి ఉద్యమానికీ తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెసు నాయకులు ముమ్మాటికీ సన్నాసులేనని ఆయన వ్యాఖ్యానించారు. విషయంపై మాట్లాడకుండా కాంగ్రెసు నాయకులు పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీకి ఉనికే లేకపోతే కాంగ్రెసు నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన అడిగారు. తమ సహనానికి కూడా హద్దులుంటాయని, ఆ సహనాన్ని కాంగ్రెసు నాయకులు పరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత సంయమనం పాటించాలని తాను తమ నాయకులను, కార్యకర్తలను కోరానని ఆయన చెప్పారు. తమకు బాధ్యత ఉందని గ్రహించాం కాబట్టే సహనం వహిస్తున్నామని ఆయన చెప్పారు. తానూ 24 గంటలు ఏకధాటిగా మాట్లాడగలనని, విషయం లేకా కాదు మాట్లాడలేకా కాదని, సంయమనం పాటించాలనే ఉద్దేశంతోనే తాను వ్యవహరిస్తున్నానని ఆయన అన్నారు. నిజాయితీ ఉంటే కాంగ్రెసు నాయకులు ఊకదంపుడు ప్రకటనలు మాని విషయం మీద మాట్లాడాలని ఆయన అన్నారు.