చిరుతో పొత్తుపై జగన్ క్యాంప్ సీరియస్
జగన్ ను సోమవారంనాడు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, శాసనసభ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, జయసుధ తదితరులు కలిశారు. తాజా పరిణామాలపై వారు జగన్ తో మాట్లాడారు. ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయం తమ పార్టీకి చెందిన వారి కుట్ర అని కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పొత్తుకు వ్యతిరేకంగా తాము తీర్మానం చేస్తామని, ఆ తీర్మానాన్ని అందజేసి పొత్తు పెట్టుకోకుండా అధిష్టానాన్నిఒప్పిస్తామని ఆయన అన్నారు.
జగన్ కు అనుకూలంగా ఉన్న రఘువీరా రెడ్డి, దానం నాగేందర్ వంటి మంత్రులు, కొంత మంది శాసనసభ్యులు ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. జగన్ ను అణచివేయడంలో భాగంగానే చిరంజీవితో పొత్తుకు సిద్ధపడినట్లు వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ వర్గాన్ని ఎంతగా అణగదొక్కాలనుకుంటే అంతగా పైకి లేస్తుందని మంత్రి రఘువీరా రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.