శ్రీవారి దర్శనం, వసతి పై భక్తులకు TTD కీలక విజ్ఞప్తి - ఇలా చేయండి..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ తగ్గడం లేదు. శ్రీవారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. బయట వరకూ క్యూ లైన్ లలో వేచి ఉండాల్సి వస్తుంది. తిరుమలకు ఇంత భారీ సంఖ్యలో ఈనెలలో భక్తులు రావడంతో అధికారులు కూడా అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్ల కోసం భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది.
తిరుమలలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలతో టీటీడీ అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. సోషల్ మీడియా వేదికలలో, అనధికారిక వెబ్సైట్లలో, మధ్యవర్తుల ద్వారా వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఏఈవో వెంకయ్య చౌదరి సూచించారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వెబ్సైట్లు, అక్రమ మార్గాల ద్వారా డబ్బులు వసూలు చేసే ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, అలాంటి వారి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీవారి దర్శనం, వసతి, సేవల బుకింగ్లు, టికెట్ల విడుదల, రద్దు అయిన టికెట్ల లభ్యత, వివిధ దర్శనాల సమాచారం, వేచి ఉండే సమయం వంటి అన్ని వివరాలను టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.

టీటీడీ కీలక సూచనలు
అలాగే ఎస్వీబీసీ ద్వారా కూడా భక్తులకు నిరంతరం అధికారిక సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. టికెట్లకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్ నెం: 155257 సంప్రదించాలని, అక్కడ అధికారికంగా పూర్తి సమాచారం, స్పష్టత అందిస్తారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తులకు లేదా అనధికారిక వ్యక్తులకు డబ్బులు బదిలీ చేయవద్దని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని భక్తులకు ఆయన సూచించారు. ఎవరైనా మధ్యవర్తులు, దళారులు లేదా అనధికారిక వ్యక్తులు బుకింగ్ల పేరుతో సంప్రదించినట్లయితే వెంటనే టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు విభాగం ఫోన్ నెం: 9866898630 సమాచారం అందించాలని కోరారు. అటువంటి వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏఈవో హెచ్చరించారు













Click it and Unblock the Notifications