యాభై స్ధానాల్లో ప్రజారాజ్యం అభ్యర్ధులు
కాంగ్రెస్తో పొత్తు కోసం చివరిదాకా వేచిచూసి, తీరా విఫలమయ్యాక ఇప్పుడు ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందేమోనని కొందరు నాయకులు సందేహించారు. ప్రస్తుతం పొత్తు లేకున్నావచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అవగాహన కుదిరే అవకాశమే అధికంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీలో ఉండటం ఎందుకనే భావనను ఎక్కువ మంది వ్యక్తీకరించినట్లు సమాచారం.
అదే సమయంలో పోటీ చేయకుండా సహకరిస్తే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పొత్తుకైనా, ఇతరత్రా సహకారానికైనా బాగుంటుందని కొంతమంది ప్రరాపా నాయకులకు పీసీసీ వర్గాలు సూచించినట్లు ప్రచారం జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి సమావేశమైనప్పుడు ఒకరిద్దరు సీనియర్ నేతలు, చిరంజీవికి సన్నిహితుడైన ఓ శాసనసభ్యుడు, గ్రేటర్ నాయకులు మాట్లాడుతూ బలమున్న స్థానాల్లోనైనా పోటీ చేయాలని గట్టిగా వాదించినట్లు తెలిసింది. అసలు పోటీయే చేయకపోవటం వల్ల ప్రజల్లోకితప్పుడు సూచనలు పంపినట్లు అవుతుందని చెప్పినట్లు వినికిడి. ఒక రాజకీయ పార్టీగా ఇది వాంఛనీయం కాదని అన్నట్లు తెలిసింది.
మరో సీనియర్ నేత సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని రీతిలో గ్రేటర్లో బహుముఖ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని స్థానాల్లో పార్టీకి గట్టి విజయావకాశాలు ఉన్నాయని వాదించినట్లు తెలిసింది. దీంతో పునరాలోచన ప్రారంభమైంది. రాత్రి పదకొండు గంటల సమయంలో అవి కొలిక్కివచ్చాయి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి హాజరై తిరిగి నివాసానికి వచ్చిన తర్వాత చిరంజీవి తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.