తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త: క్యాష్ లెస్: కార్డులు పంపిణీ
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల చిరకాల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద పూర్తిస్థాయి నగదు రహిత వైద్య సేవలను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందనున్నాయి.
ఈ నూతన ఆరోగ్య పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తాజాగా ఓ ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్ను కూడా ప్రారంభించింది. దీంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. దీని ద్వారా దాదాపు 17.88 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, నిరుపేద పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఉచిత వైద్య సేవలు సులభంగా అందుతాయి.

ఈ పథకాన్ని కొద్దిసేపటి కిందటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రారంభించారు. లబ్దిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబాలకు నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను ప్రభుత్వం విస్తరించింది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 886 ఆసుపత్రులను ఈ క్యాష్ లెస్ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది.
ఉద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వ వైద్యశాలలతో పాటు కార్పొరేట్ మెడికల్ కాలేజీలు కూడా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉన్నాయి. ఎంపిక చేసిన ఈ నెట్వర్క్ ఆసుపత్రులలో అందించే అన్ని రకాల శస్త్రచికిత్సలు, వివిధ పరీక్షలకు అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) నిర్దేశించిన నిబంధనలు, ప్రత్యేక రేట్లకు అనుసంధానించారు. దీనివల్ల ఆసుపత్రుల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారుల మధ్య చికిత్సల బిల్లులకు సంబంధించి ఎటువంటి వివాదాలు లేకుండా, పారదర్శకంగా లావాదేవీలు పూర్తవుతాయి. రేట్ల అనుసంధానం వల్ల ఉద్యోగులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ హెల్త్ పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమకు సమీపంలో ఉండే నెట్వర్క్ ఆసుపత్రుల పూర్తి వివరాలు, అందుబాటులో ఉన్న బెడ్లు, చికిత్స విభాగాలు సులభంగా తెలుసుకోవచ్చు. హెల్త్ కార్డుల పంపిణీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభమైనందున పారదర్శకత మరింత పెరిగింది. ఈ నూతన సదుపాయంతో నిధుల కోసం ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రత కల్పించింది.












Click it and Unblock the Notifications