గ్రేటర్ ఫలితాలపై అంతర్మథనంలో డిఎస్
ఆరు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సానుభూతి పవనాలు కూడా లేవు. కాంగ్రెసు శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకున్నట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీ ఫలితాలు సాధించలేకపోయింది. దీంతో అప్పుడే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పరస్పరం దుమ్మెత్తి పోసుకునే వాతావరణం మొదలైంది. మంత్రి ముఖేష్ నియోజకవర్గంలో కూడా పార్టీకి దెబ్బ తగిలింది. తమ తమ నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు సాధించని మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెసు మహిళా విభాగాం అధ్యక్షురాలు గంగా భవానీ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ వైయస్ జగన్ వ్యతిరేక వర్గీయుల నుంచి మరింత ఊపందుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం డి. శ్రీనివాస్ కు గానీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు గానీ అంత సులభం కాదు. పరిస్థితి చేయి దాటుపోతుందేమోననే ఆందోళనలో డి. శ్రీనివాస్ ఉన్నట్లు చెబుతున్నారు.