నాటుబాంబులతో హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర
నలుగురు వ్యక్తులు కారులో వచ్చి గోనెసంచీని వదిలి వెళ్లడాన్ని గమనించి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వారిని వెంబడించారు. వారు పారిపోయారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి గోనెసంచీని పరిశీలించి నాటుబాంబులను కనుక్కున్నారు. విశ్వవిద్యాలయంలో దాదాపు 70 మంది స్థానికేతరులను గుర్తించి వెలుపలికి పంపించేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అసాంఘిక శక్తుల ప్రవేశించాయనే అనుమానంతో తనిఖీలు చేశారు. గుర్తింపు కార్డులున్న విద్యార్థులను మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. అసాంఘిక శక్తులు ప్రవేశించి అల్లర్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.
కాగా, తమది బాంబుల సంస్కృతి కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఎ. చంద్రశేఖర్, వినోద్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తాము శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నామని వారు చెప్పారు. అసాంఘిక శక్తులు ప్రవేశించి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిసిపి స్టీఫెన్ రవీంద్రను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.