"మా రాష్ట్రంలో తీవ్ర కరువు.." ప్రధానికి సీఎం అర్జెంట్ లేఖ!
దేశంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు ముఖం చాటేయడంతో చాలా రాష్ట్రంలో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యవసర లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షపాత లోటు, కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు తక్షణమే ఒక కేంద్ర అధ్యయన బృందాన్ని పంపించాలని ఆయన ప్రధానిని కోరారు.
ఈ విషయాన్ని సీఎం డీకే శివకుమార్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, తాగునీటి లభ్యత, గ్రామీణ ప్రజల జీవనోపాధి తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అయితే, ఈ కష్టసమయంలో రైతులకు భరోసా ఇవ్వడానికి, కరవు నివారణ చర్యలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ప్రధానిని కోరారు.

పడిపోయిన వర్షపాతం.. ఎండిపోతున్న జలాశయాలు
భారత వాతావరణ శాఖ (IMD) ముందుగా అంచనా వేసినట్లుగానే ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావం చాలా బలహీనంగా మారింది. సాధారణంగా జూలై 11 నాటికి రాష్ట్రంలో 292 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఈసారి కేవలం 203 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అంటే ఏకంగా 30 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో దాదాపు 18 జిల్లాల్లో వర్షాలు పడలేదు. తాలూకాల వారీగా చూస్తే, మొత్తం 240 తాలూకాలకు గానూ 141 తాలూకాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
నదీ పరివాహక ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి
కర్ణాటకలోని నదులకు ప్రధాన నీటి వనరుగా ఉండే మల్నాడు ప్రాంతంలో అత్యధికంగా 34 శాతం వర్షపాత లోటు నమోదైంది. దీనివల్ల కావేరి, తుంగభద్ర, భద్ర వంటి కీలక నదుల్లోకి నీటి ప్రవాహం తగ్గిపోయింది. అలాగే తీరప్రాంత కర్ణాటకలో 30 శాతం, ఉత్తర కర్ణాటకలో 24 శాతం, దక్షిణ కర్ణాటక పరిధిలో 18 శాతం చొప్పున వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావంతో ఖరీఫ్ పంటల సాగు బాగా ఆలస్యమైంది.
మరుభూమిగా మారుతున్న భూములు
రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల రీత్యా కర్ణాటకలో దాదాపు 77 శాతం ప్రాంతం ఎండిపోయిన, పాక్షికంగా ఎండిపోయిన జోన్ల పరిధిలోనే ఉంటుంది. రాజస్థాన్ తర్వాత దేశంలోనే అత్యధికంగా వర్షాధార పంటలపై ఆధారపడే భూములు (దాదాపు 84.79 లక్షల హెక్టార్లు) కర్ణాటకలోనే ఉన్నాయి. వర్షాలు సమయానికి పడకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం స్పందించి, తక్షణ సాయం అందించడం ఎంతైనా అవసరమని ముఖ్యమంత్రి తన లేఖలో స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications