తెలంగాణపై ప్రకటనకు ఢిల్లీలో కసరత్తు?
రాజ్యసభలో బిజెపి సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు, లోకసభలో సుష్మా స్వరాజ్ లోకసభలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా రంగంలోకి దిగి అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాంచీ వెళ్లాల్సిన ఆయన అగిపోయారు. అల్లరి మూకలు మాత్రమే ఉన్నాయని, పోలీసులతో అరికట్ట వచ్చుననే అభిప్రాయంతో మాత్రమే ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులతో పార్లమెంటు సభ్యులు రంగంలోకి దిగడం, ఆందోళన మరింతగా పెరిగే పరిస్థితి ఉండడంతో పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు చెబుతున్నారు.
జైపాల్ రెడ్డి సోమవారంనాడు కెసిఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కెసిఆర్ ను పరామర్శించారు. మరో వైపు ఆయన అధిష్టానం నాయకులతో కూడా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ వంటి వారు తెలంగాణపై ప్రకటనను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకటనలో పదాల పొందికపై వారు మల్లగుల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదయం పార్లమెంటుకు రాలేదు. 12 గంటల ప్రాంతంలో ఆమె పార్లమెంటుకు వచ్చారు. ఆమెను కలుసుకోవడానికి తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు కలవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం కనిపించలేదు. అయితే, సోనియా గాంధీ కార్యలయంలో మాత్రం తెలంగాణ ప్రకటనకు సంబంధించిన విషయం తెలియదంటున్నారు. కాగా, వ్యవహారం తీవ్రస్థాయికి చేరుకుందని, ఏదో ఒక పరిష్కారం చూస్తామని సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగానే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.