తెలంగాణపై కదిలిన సోనియా గాంధీ
అధిష్టానం నిర్ణయమే తమ నిర్ణయమని రాష్టంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు నాయకులు చెప్పగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతిస్తామని తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు స్పష్టం చేశాయి. తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి, సిపిఐ నాయకులు చెప్పారు. తమ వైఖరిని గతంలోనే చెప్పామని సిపిఎం చెప్పింది. ఓట్ల కోసం కాకుండా నిజాయితీగా నిర్ణయం తీసుకోవాలని లోకసత్తా సూచించింది. తమ నిర్ణయాన్ని ఒకటిరెండు రోజుల్లో చెప్తామని మజ్లీస్ తెలిపింది.
సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం శాసనసభలో కాంగ్రెసు అధిష్టానం తీర్మానం ప్రతిపాదింపజేస్తుందని పార్టీ పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు. అయితే అధిష్టానం నుంచి ఎటువంటి సూచనలూ రావడం లేదు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దీక్ష విరమింపజేస్తే మిగతా విషయాలను పరిష్కరించడం కష్టం కాదనే భావనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు సమాచారం.