సమైక్యాంధ్రకే కట్టుబడుతున్నాం: చిరంజీవి
తెలంగాణపై తాము నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఊహించని విధంగా సమైక్యాంధ్ర కోసం ప్రజలు ఉద్యమంలోకి వచ్చారని, అది రాజకీయ నాయకుల ప్రేరేపితం కాదని, ప్రజల నుంచి వచ్చిందేనని ఆయన సమర్థించుకున్నారు.విభజనకు ఇంత వ్యతిరేకత పెల్లుబుకుతుందని ఎవరూ ఊహించలేదని, కాంగ్రెసు, తెలుదేశం పార్టీలు కూడా ఊహించలేదని, తాము ఊహించలేదని ఆయన అన్నారు. ప్రజాభీష్టం మేరకు పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు రాజీనామా చేశారని, తమ పార్టీ శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేశారని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకు కాదని,కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు కాబట్టి తాము సమైక్యాంధ్రకు ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.
తనలో వచ్చిన మార్పు వల్లనే నైతిక బాధ్యత వహించి తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. సమైక్యాంధ్రలో తెలంగాణ భాగమని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలకు అవగాహన వచ్చేలా పనిచేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంత సంక్షోభం రాలేదని, దీనికి కాంగ్రెసు పార్టీయే కారణమని, ఇంత జరుగుతుంటే కాంగ్రెసు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.