భక్తులకు విజ్ఞప్తి: భారీ వర్షాల ముప్పు, ఆరెంజ్ అలెర్ట్..
పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనం కోసం చార్ధామ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ, తెహ్రీ గఢ్వాల్ జిల్లాల్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలతో పాటు మెరుపులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ 'ఆరెంజ్ అలెర్ట్' ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాత్రికులు, పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గఢ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే యాత్రికులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మే 12, 13 తేదీల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున, భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వాతావరణం కుదుటపడిన తర్వాతే ప్రయాణించడం సురక్షితమని, అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. యాత్రికుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

శరవేగంగా యాత్ర.. పటిష్టమైన ఏర్పాట్లు
ప్రస్తుతానికి చార్ధామ్ యాత్ర సజావుగానే సాగుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని మార్గాల్లో తాగునీరు, ఆరోగ్య సేవలు, పారిశుధ్యం, పార్కింగ్ మరియు ట్రాఫిక్ సౌకర్యాలను బలోపేతం చేసింది. ముఖ్యంగా కేదార్నాథ్ మార్గంలో భద్రతను మరింత కఠినతరం చేశారు. ఈ ప్రాంతాన్ని సూపర్జోన్లు, సెక్టార్లుగా విభజించి.. SDRF, NDRF, అగ్నిమాపక మరియు పోలీసు బలగాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రద్దీని నియంత్రించేందుకు 'టోకెన్ విధానం' అమలులోకి తెచ్చారు.
పర్యావరణ హితంగా 'గ్రీన్ యాత్ర'
భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం "గ్రీన్ యాత్ర" ప్రచారాన్ని ముమ్మరం చేసింది. యాత్ర మార్గాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. దీనితో పాటు "వోకల్ ఫర్ లోకల్" పిలుపులో భాగంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు. ఏప్రిల్ 19న వైభవంగా ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా.. శ్రీ కేదార్నాథ్ స్వామివారి పంచముఖి డోలీ తన శీతాకాల నివాసమైన ఓంకారేశ్వర్ ఆలయం నుండి బయలుదేరడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తులు వాతావరణ శాఖ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సురక్షితంగా తమ యాత్రను పూర్తి చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోరుతోంది. భారీ వర్షాల సూచన ఉన్న నేపథ్యంలో తొందరపడి ప్రమాదకరమైన ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications