పార్టీలు ప్రాంతీయంగా విడిపోయాయి: సిఎం
ఇంతకు ముందు తెలంగాణలో ఉద్యమం తలెత్తిందని, పదో తారీఖు ఉదయం స్వచ్ఛందంగా విభజనకు వ్యతిరేకంగా రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉద్యమాలు పెల్లుబుకాయని, ఇది విస్తరిస్తోందని ఆయన చెప్పారు. విషయం కేంద్ర పరిశీలనలో ఉందని, ఈ విషయాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తున్నాయని, అందువల్ల కేంద్ర నిర్ణయం త్వరగా వెలువడడానికి ఎవరి పద్ధతుల్లో వాళ్లం ప్రయత్నాలు చేద్దామని, ప్రజా జీవనానికి మాత్రం అంతరాయం కలిగించవద్దని ఆయన అన్నారు. ఢిల్లీ నాయకులకు చెప్పుకునే పద్ధతిలో చెప్పుకోండని, ప్రజా జీవితం స్తంభించకుండా జాగ్రత్తులు తీసుకోవాలని ఆయన అన్నారు. పార్టీల ఆందోళనలను చట్టరీత్యా అనుమతించకపోవడం అనేది ఉండదని, అయితే అది శాంతియుతంగా జరగాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య మార్గం అనుసరించాలని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు వాన పడుతుండడం వల్ల గదిలోకి వెళ్తామంటే పోలీసులు అనుమతించారని, అలా అనుమతించినందుకు లోపలికి వెళ్లి తలుపులు పెట్టుకుని మేం రామంటే ఎలా అని ఆయన అన్నారు.
ఆందోళనల వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన అన్నారు. సాధారణ స్థితిలో పాలనా యంత్రాంగం స్తంభించలేదని ఆయన చెప్పారు. సంక్షోభ స్థితిలో ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించదని ఆయన చెప్పాుర. సోమవారం నుంచైనా విద్యాసంస్థలు నడపాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు. శాసనసభ్యుల రాజీనామాల గురించి ప్రశ్నించాల్సింది స్పీకర్ నేనని, వాటితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్ర విభజన దేశంలో చాలా చోట్ల ఉందని ఆయన అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర ఉద్యమాల్లో అసాంఘిక శక్తులు ప్రవేశించినట్లు తనకు తెలియదని, అయితే అలాంటి శక్తులు ప్రవేశించి ఇబ్బంది పెట్టే పరిస్థితులుంటాయని, దాని వల్ల పరిస్థితి చక్కబడకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుందని ఆయన చెప్పారు. ఆందోళన విషయంలో తమ కాంగ్రెసు పార్టీకి మినహాయింపు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.