సమైక్యాంధ్రలో నేతల అరెస్టులు మొదలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం నేతలు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరణం బలరాం తదితరులను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యురాలు కాండ్రూ కమల తాజాగా ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. కడప జిల్లాలో ఆమరణ దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. విజయవాడలో టిడిపి శాసనసభ్యుడు దేవనేని ఉమా మహేశ్వర రావు వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం నాయకులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన సమైక్యాంధ్ర ఉద్యమానికి తిరుపతి నుంచి శ్రీకారం చుట్టగా, తెలుగుదేశం నాయకులు తిరుపతి నుంచి సమైక్యాంధ్ర బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం వరకు సాగుతుంది. రాయలసీమ, కోస్తాంధ్రల్లో విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. అనంతపురం లో రైల్వే కళ్యాణ మంటపానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. తూర్పు గోదావరి జిల్లాలో రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. కర్నూలులో కలెక్టరేట్ ఎదుట ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications