చిరంజీవి 'సమైక్య'తో హైదరాబాద్ ప్రజారాజ్యం ఖాళీ
చిరంజీవి నిర్ణయం తమను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, ఆయన తెలంగాణ ప్రజలను వంచించారని, చరిత్ర హీనుడుగా మిగులుతారని, కేవలం స్వార్థం కోసమే చిరంజీవి ఆ నిర్ణయం తీసుకున్నారని పీఆర్పీ నాయకులందరూ ముక్తకంఠంతో నిరసన వ్యక్తంచేస్తున్నారు.
గ్రేటర్లోని 150 వార్డుల నాయకులందరూ ఇదేస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో దాదాపు 12లక్షల మంది ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.సామాజిక తెలంగాణ అనే నినాదానికి ఆకర్షితులమై తాము పార్టీ జెండాను భుజాన వేసుకుని మోశామని, తీరా తెలంగాణ ప్రకటన వచ్చాక సమైక్యాంధ్రకు జై కొట్టడంపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఎందరో పార్టీని వీడి వెళ్లినా, తీవ్ర విమర్శలు చేసినా తాము భరించామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిని ఎవరో తప్పుదోవ పట్టించారన్న ఆవేదనను వ్యక్తం చేస్తూనే తామిక ఆ పార్టీలో కొనసాగబోమని వేరు కుంపటి పెట్టుకుంటామని వివరించారు.