హైదరాబాద్ లో ఆర్య-2 కు తెలంగాణ వాదుల అడ్డంకి
టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ కార్యకర్తలు కాప్రాలోని శివశక్తి సినిమా థియేటర్పై దాడి చేసి 'సలీమ్' పోస్టర్లు చింపివేసి కటౌట్లను ధ్వంసం చేశారు. కుషాయిగూడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్లోని పలు థియేటర్లపై టీఆర్ఎస్ నాయకులు గురువారం దాడి చేసి సినిమా ప్రదర్శనలను నిలిపివేయించారు. పోస్టర్లను చింపివేసి కటౌట్లు దగ్ధం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకులైన చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల చిత్రాలను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు. మల్కాజిగిరిలోని రాఘవేంద్ర థియేటర్లో సలీమ్ సినిమా పోస్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేసి థియేటర్ను మూసివేయించారు. సికింద్రాబాద్లోని ప్రశాంత్ థియేటర్ ముందు పీజీ కళాశాల విద్యార్థులు ఆందోళన జరిపి మోహన్బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్బాబు, విష్ణువర్ధన్ల కటౌట్లు ధ్వంసం చేశారు. పోస్టర్లు చింపి బ్యానర్లను తొలగించారు. దీంతో యాజమాన్యం సినిమా ప్రదర్శనను రద్దు చేసింది. ఇదే ప్రాంతంలోని మంజు థియేటర్లో ఆర్య-2 సినిమాను నిలిపివేయించారు. దీంతో రెండవ రోజు కూడా సినిమా ప్రదర్శన ఆగిపోయింది. లోతుకుంటలోని లకి కళామందిర్, నర్తకి థియేటర్లలోనూ ఆ రెండు చిత్రాలను నిలిపివేయించారు.
తెలంగాణ ప్రజల పోరాటాల చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి...లేదంటే అడ్రస్లు మారతాయని హెచ్చరిస్తూ మోహన్ బాబు, చిరంజీవిలపై ఓయూ టీఎస్ జాక్ నాయకులు మండిపడ్డారు. ఓయూలో చిరంజీవి, మోహన్బాబుల దిష్టిబొమ్మలకు శవయాత్ర జరిపి దగ్ధం చేశారు. సినిమా డైలాగులు బయట మాట్లాడితే హీరోను జీరో చేస్తామని మోహన్బాబును హెచ్చరించారు. సామాజిక తెలంగాణ గురించి ఎన్నికల ముందు మాట్లాడిన చిరంజీవి తన అభిప్రాయాలు మార్చుకోవచ్చని సిగ్గు విడిచి మట్లాడుతున్నాడని మండిపడ్డారు.