చిదంబరంపై భగ్గుమన్న లగడపాటి
తెలుగు మాట్లాడడం రాని పార్టీలది కూడా సమైక్యవాదమేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో చర్చలు జరగకుండా తెలంగాణపై కేంద్రం చర్చలు జరపడం సరి కాదని ఆయన అన్నారు. ప్రతిదానికీ కేంద్రం జోక్యం చేసుకుంటే రాష్టం ఎందుకని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి వేసిన కమిటీని పునర్వ్యస్థీకరించాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీలు స్వార్థంతో వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని జమ్మూ కాశ్మీర్ లా చూసే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. ఐటి పరిశ్రమ బెంగుళూర్ కు, సినీ పరిశ్రమ చెన్నైకి తరలిపోవడానికి సిద్ధపడుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనలో అనేక సమస్యలున్నాయని, ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర స్థాయి కమిటీ అవసరమని ఆయన అన్నారు. రాష్ట్రం హక్కులను కాపాడాలని ఆయన కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన పార్టీలు మొన్నటి ఎన్నికల్లో మట్టి కరిచాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య గాంధేయవాది అని, అటువంటి రోశయ్యపై విమర్శలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. తన సమైక్యవాద ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. విభజన రాజకీయాలతో ప్రజలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఓడిన పార్టీలు ప్రజారాజ్యం లాగే తమ వైఖరి మార్చుకుంటాయని ఆయన అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాజకీయ నాయకుల స్వార్థంతో విద్యార్థులు, యువకులు నష్టపోతున్నారని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర కోసం, సమైక్య తెలంగాణ కోసం తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణపై అన్ని పార్టీలతో చర్చించిన తర్వాతనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కలిసి ఉండడం వల్ల తెలంగాణ నష్టపోయిందని చెప్పమనండని ఆయన అడిగారు. 1956కు ముందు ఆంధ్ర అభివృద్ధి చెందిందని, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి నిధులు ఎక్కవ కేటాయించాలని, తెలంగాణ మెట్ట ప్రాంతం కాబట్టి నిధులు ఎక్కవ పెట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోకూడదని, కావాలంటే రాష్ట్రం పేరును తెలంగాణగా మార్చుకోవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణకు తక్కువ, ఆంధ్రకు ఎక్కువ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు.