బాలినేనికి బెర్త్ ఖరారు? ఒంగోలు వదిలి అక్కడి నుంచి పోటీ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో బాలినేని జరిపిన భేటీ ఇటు కూటమిలోనూ, అటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 'ఒంగోలు టైగర్'గా పేరుగాంచిన బాలినేని శ్రీనివాసరెడ్డి రూట్ మారుస్తున్నారు. జనసేనలో చేరిన తర్వాత తొలిసారి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... బాలినేనికి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్లియరెన్స్ వచ్చేసిందని టాక్. అయితే, ఆయన తన సొంత గడ్డ అయిన ఒంగోలును వీడి, దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది.

దర్శి వైపు చూపు..
కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా త్వరలోనే దర్శి నియోజకవర్గాన్ని జనసేనకు అప్పగించేందుకు టీడీపీ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ విద్యుత్ శాఖ మంత్రి అయిన బాలినేనిని దర్శికి పంపడం ద్వారా అక్కడ కూటమి జెండాను మరింత బలంగా పాతవచ్చనేది అధిష్టానం ఆలోచన. దీనిపై ఇప్పటికే టీడీపీ-జనసేన అగ్రనాయకత్వాల మధ్య సూత్రప్రాయంగా ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం.
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవి చూసినా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలను మాత్రం గెలుచుకుంది. యర్రగొండపాలెం రిజర్వ్డ్ సీటు కాబట్టి.. దర్శిపై పట్టు సాధించి వైసీపీకి చెక్ పెట్టాలని ప్లాన్ కూటమి నేతల్లో ఉంది. కాగా దర్శి సీటును వైసీపీ కూడా చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు బాగానే చూసుకుంటున్నారనే విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు తమ్ముళ్లలో గందరగోళం..
దశాబ్దాలుగా దర్శిలో పార్టీ కోసం పనిచేస్తున్న టీడీపీ స్థానిక నాయకత్వానికి ఈ పరిణామం మింగుడుపడటం లేదు. బాలినేని వంటి సీనియర్ నేత హఠాత్తుగా తమ నియోజకవర్గానికి వస్తారనే ప్రచారంతో స్థానిక 'తెలుగు తమ్ముళ్లు' తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన గొట్టిపాటి లక్ష్మీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆమె పనితీరు పట్ల కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వెనుక ఉన్న ఆ 'ఒంగోలు సీనియర్' ఎవరు?
బాలినేనిని ఒంగోలు నుంచి దర్శికి షిఫ్ట్ చేయడం వెనుక ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత చక్రం తిప్పినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒంగోలు నియోజకవర్గంపై తన పట్టును నిలబెట్టుకోవడానికి, అక్కడ బాలినేని లాంటి బలమైన నేత ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావించే సదరు సీనియర్ నేత ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలినేనిని దర్శికి పంపడం ద్వారా ఒంగోలులో తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవాలనేది ఆ నేత ప్లాన్గా కనిపిస్తోంది.
బాలినేని ఒక సుదీర్ఘ రాజకీయ ప్రయాణం
బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రకాశం జిల్లా చరిత్రతో ముడిపడి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా, బంధువుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలినేని, ఒంగోలు నియోజకవర్గాన్ని తన కోటగా మార్చుకున్నారు. వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒంగోలు ఎమ్మెల్యేగా విజయం సాధించి, వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
వైఎస్సార్ మరణం తర్వాత జగన్ మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవిని, కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) స్థాపనలో కీలక భూమిక పోషించారు. ఒంగోలులో వరుస విజయాలతో జిల్లాలోనే తిరుగులేని నేతగా ఎదిగారు. 2019 వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించారు. జగన్ రెండో సారి మంత్రి వర్గ విస్తరణ సమాయంలో అధిష్టానంతో పెరిగిన గ్యాప్ తో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.
దర్శిలో 'వాసు' మార్క్ సాధ్యమేనా?
ఒంగోలు గడ్డపై ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు బాలినేని సొంతం. అలాంటి నేత ఇప్పుడు పూర్తిగా కొత్త నియోజకవర్గమైన దర్శిలో అడుగుపెట్టి.. సామాజిక సమీకరణాలు, స్థానిక టీడీపీ నేతల అసంతృప్తిని తట్టుకుని.. తన మార్క్ రాజకీయాన్ని ఎలా చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, చంద్రబాబు-బాలినేని భేటీతో ప్రకాశం జిల్లా కూటమి రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పక తప్పదు. భవిష్యత్తులో ఈ సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.














Click it and Unblock the Notifications