భార్య భానుమతి అదృశ్యం, సూరి కదలికపై నిఘా
ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకటి, రెండుసార్లు మాత్రమే ఆమె కనిపించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి ఆయనను కలిశారు. ఆ తర్వాత ఆమె పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో ఎక్కడా కనిపించలేదు. సూరి విడుదల సందర్భంగానైనా ఆమె జైలు వద్దకు వస్తారని మద్దతుదారులు భావించారు. అయితే ఆమె కనిపించకపోవడం వారిని నిరాశ పరిచింది. భానుమతి ఎక్కడికెళ్లారనే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి విడుదలతో జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చేటుచేసుకోకుండా ముందు జాగ్రత్త వహిస్తోంది. ఇరుపక్షాల కదలికలపై నిఘా పెంచింది. ముఖ్యంగా పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలోని ఫ్యాక్షన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసులను అప్రమత్తం చేశారు. సంబంధిత పోలీసు సిబ్బందితో ఉన్నతాధికారి ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫ్యాక్షన్ కార్యకలాపాలతో సంబంధమున్న వ్యక్తుల జాబితా రూపొందించినట్టు సమాచారం. వారి కదలికలపై కూడా నిఘా ఉంచారు.
సంబంధిత పోలీసు స్టేషన్లలో సమాచారం ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు వెళ్లే విధంగా జాగ్రత్త వహించాలని సూచించినట్టు తెలుస్తోంది. తమ దృష్టికి తీసుకురాకుండా వెళితే...తమ బాధ్యత ఉండదని ముందే హెచ్చరించనున్నట్టు సమాచారం. అదే విధంగా సూరికి ప్రధాన ప్రత్యర్థులైన పోతుల సురేష్, చమన్ ఆచూకీ తెలుసుకునే బాధ్యత ప్రత్యేక పోలీసు సిబ్బందికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. సూరి జైలులో ఉన్నందున ఇదివరకు అజ్ఞాతంలో ఉన్న వీరి గురించి పెద్దగా పట్టించుకోలేదు. సూరి బాహ్య ప్రపంచంలోకి రావడంతో ఇరువర్గాలు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతాయేమోననే కోణంలో నిఘా ఉంచారు. వారికి ఎవరితోనైనా సంబంధాలున్నాయా? బయట ఏమి చేస్తున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది.