రోశ్యయ్యకు 'మంత్రివర్గ' గండం

తెలంగాణ మంత్రులు మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో రోశయ్య బుధవారం తలపెట్టిన మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. తెలంగాణ బంద్ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. బంద్ కు ప్రభుత్వం మద్దతు ప్రకటించినట్లుగా ఉందనే వ్యాఖ్య వినిపించింది. అయితే రోశయ్య దాన్ని మరో రకంగా సమర్థించుకున్నారు. బంద్ కారణంగా అధికారులు పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందని, ఎప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని, అందువల్ల మంత్రి వర్గ సమావేశాన్ని రద్దు చేసుకున్నామని రోశయ్య చెప్పారు.
కాగా, జనవరి 4,5 తేదీల్లో తలపెట్టిన జిల్లా కలెక్టర్ల, ఎస్పీల సమావేశం కూడా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసి ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో సీమాంధ్ర మంత్రులతో మాత్రమే ఆ సమావేశాలు నిర్వహించడానికి ఆయన సిద్ధంగా లేరు. అయితే సమావేశాలు నిర్వహించాల్సిందేనని సీమాంధ్ర మంత్రులు పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాలను వాయిదా వేయడానికి కూడా రోశయ్యకు మంచి సాకే దొరికింది. జనవరి 5వ తేదీన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి హాజరు కావాల్సి ఉన్నందున ఈ సమావేశాలను వాయిదా వేస్తున్నామని చెప్పడానికి వీలు చిక్కుతుంది. ఏమైనా రోశయ్యకు కష్టాల మీద కష్టాలు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications