రిలయెన్స్ దుకాణాలు, బంక్ లపై దాడులు
వన్టౌన్ లో రిలయన్స్ ఫ్రెష్ షాపుపై విద్యుద్దీపాలను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. భవానీపురం బైపాస్రోడ్డులో రిలయన్స్ షాపుపై దాడికి ప్రయత్నించారు. ఇదిలా ఉండగా చిల్లకల్లు వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేయడంతో 14 కిలోమీటర్ల మేరకు వాహనాలు ఆగిపోయాయి. విస్సన్నపేటలో సెల్టవర్ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. పెడన, నూజివీడు ప్రాంతాలలో వైఎస్ అభిమానులు రాస్తారోకోలు నిర్వహించారు. నందిగామలో శుక్రవారం బంద్ నిర్వహించాలని ఎంపిపి కోవెలమూడి వెంకటనారాయణ పిలుపు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు నిర్వహించడానికి కాంగ్రెస్ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో బంద్ పాటించనున్నట్లు గురువారం రాత్రి సమాచారం అందింది. జగ్గయ్యపేట, పెడన, నందిగామ, విస్సన్నపేట, నూజివీడు, అవనిగడ్డ తదితర ప్రాంతాలలో బంద్కు పిలుపునిచ్చారు. రిలయన్స్ సంస్థలపై దాడులు చేయడంతో జిల్లా అంతటా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడనుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులన్నింటినీ రద్దు చేశారు. శుక్రవారం బంద్ జరగనున్న జిల్లాలకు కూడా బస్సులను నిలిపివేస్తామని అధికారలు చెప్పారు. నగరంలో 144వ సెక్షన్ విధించారు.
కొన్ని చానళ్లలో ప్రసారమైన సమాచారం నిజం కాదని ఇన్ఛార్జి పోలీసు కమిషనర్ మహేష్భగత్ చెప్పారు. నగరంలో 144 సెక్షన్ విధించామన్నారు. వదంతులను ప్రచారం చేయవద్దని, నమ్మవద్దని కూడా తెలిపారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.